నమిత న్యూస్ - Telagana / Annamayya : హైదరాబాద్ - మే 15 : చేప మందు పంపిణీకి తెలంగాణ అగర్వాల్ సమాజ్ చేయూత అందించనుంది. హైదరాబాద్లో బత్తిని సోదరులు ఇచ్చే ప్రసిద్ధ చేప మందు పంపిణీ ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ప్రారంభమవుతుందని తెలంగాణ అగర్వాల్ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గోయల్ వెల్లడించారు. తమ సమాజ్ సభ్యులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటారని చెప్పారు. చేప ప్రసాదం పంపిణీ కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గోయల్, శ్వాసకోశ వ్యాధులు, ముఖ్యంగా ఆస్తమా నివారణకు ఈ మందును వేలాది మంది ప్రజలు తీసుకుంటారన్నారు. జూన్ 8 , 9 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉదయం 8:30 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు 32 నుండి 34 ప్రత్యేక కౌంటర్లు, 40కి పైగా క్యూలైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కేంద్రం వద్దే చేప పిల్లలను విక్రయిస్తారని, పంపిణీ ప్రాంతంలో వెటర్నరీ వైద్యులు, మత్స్యశాఖ నిపుణులు పర్యవేక్షణలో ఉంటారని వివరించారు. ఈ సమావేశంలో మున్నలాల్ అగర్వాల్, చైర్మన్ , సలహాదారు సురేష్ అగర్వాల్, గోపాల్ మోర్, ఉపాధ్యక్షుడు సీఏ హరిగోవింద్ ప్రసాద్, కార్యదర్శి సీమా జైన్, కోశాధికారి సీఏ రాంగోపాల్ అగర్వాల్, మాజీ అధ్యక్షులు ఆర్.ఎన్.గుప్తా, మాజీ అధ్యక్షులు సురేష్ సింఘాల్, బత్తిని కుటుంబం నుంచి బత్తిని అమర్ నాథ్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్ , చంద్ర శేఖర్ గౌడ్ , షావ శంకర్ గౌడ్, సంతోష్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. *జూన్ 8న చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం : ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిన సోదరుల కుటుంబం అందించే చేప ప్రసాదానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పంపిణీ సమయం, క్యూలైన్ల నిర్వహణపై అధికారులు ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు.* *1.25 లక్షల చేప పిల్లలు సిద్ధం : ఈ కార్యక్రమం కోసం మత్స్యశాఖ ద్వారా సుమారు 1.25 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచుతున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ చేప పిల్లలను భక్తులకు సరఫరా చేసే క్రమంలో ఎక్కడా జాప్యం జరగకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ జరిగే ప్రాంతంలో వెటర్నరీ వైద్యులు, మత్స్యశాఖ నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్, ట్రాఫిక్ విభాగం పార్కింగ్ , భద్రతను పర్యవేక్షించగా, జీహెచ్ఎంసీ పారిశుధ్య పనులను, రెవెన్యూ, ఆర్ అండ్ బీ విభాగాలు వసతి కల్పనను చూసుకోనున్నాయి. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, అత్యవసర వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు, మెట్రో సర్వీసులను నడిపేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది
Reporter
Namitha News