నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత - టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ - ఇరువర్గాలను పంపించి వేసిన పోలీసులు మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.ఈ విధానాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి తీవ్రంగా విమర్శిస్తోంది.ఈ అంశంపై టిడిపి,వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా పిపిపి విధానం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై క్లుప్తంగా వివరించారు.దీనిపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కొందరు శ్రీరామ్ చినబాబుపై సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే ఊరుకోమని అవసరమైతే కళాశాల వద్దకు కళాశాల వద్దకు వస్తామని అక్కడే తేల్చుకుందామన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అనుచరులు కొంతమంది ఆదివారం మెడికల్ కళాశాల వద్దకు చేరుకోగా విషయం తెలుసుకున్న శ్రీరామ్ చినబాబు అనుచరులు,టిడిపి శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో టిడిపి శ్రేణులు,వైసిపి కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.గత ఐదేళ్ల కాలంలో దాడులు,దౌర్జన్యాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ ఆరోపించారు.ఇది వైసీపీ ప్రభుత్వం కాదని,రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమని వైసిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.విషయం తెలుసుకున్న పోలీసులు మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు.టిడిపి,వైసిపీ శ్రేణులను అక్కడి నుండి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.పిపిపి విధానంపై ఆరోపణలు,ప్రతి ఆరోపణలతో వైసిపి,టిడిపి నాయకులు తీవ్రవ్యాఖ్యలు చేసుకుంటున్నారు.ఇది ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.
Reporter
Namitha News