నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళల భద్రత.. మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న అవగాహన ప్రచారం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మత్తు పదార్థాలు లేని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు వినూత్న ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు “సురక్షిత సమాజం - మనందరి బాధ్యత” అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీలో ఆటోలకు ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి, లౌడ్స్పీకర్ల ద్వారా నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. గంజాయి వాడకం మెదడును దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అమ్మకాలు, జూదం, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 పోలీస్ హెల్ప్లైన్, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్, 1972 గంజాయి హెల్ప్లైన్, 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తూ సీఐలు, ఎస్ఐలు క్షేత్రస్థాయిలో స్వయంగా పాల్గొని అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Reporter
Namitha News