నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి మాధవ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుందని జులై 21వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 18 వరకు మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సెప్టెంబర్ 22వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. జులై 14వ తేదీ నుండి ఒక పోలింగ్ బూత్ లో 1200 ఓట్లకు మించి ఓటర్లు ఉంటే ఓటర్ల జాబితా పరిశీలించి ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్నుమలేటర్లు, సూపర్వైజర్లు ముమ్మరంగా పాల్గొని ఎలాంటి పొరపాట్లు లేకుండా నికాసైన ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకుడు సిద్ధమల్ రెడ్డి, బిజెపి నాయకులు గోపాల్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు రమణ, కూటమి నాయకులు పాల్గొనగా వైకాపా నాయకులు గైర్హాజరయ్యారు
Reporter
Namitha News