నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు : మదనపల్లి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే నిబంధన పేరుతో పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడం అత్యంత అన్యాయమని, తొలగించిన కార్మికులను వెంటనే యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆసుపత్రి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఉపాధి అవకాశాల కొరత నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే కారణంతో విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గజపతి, పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మి పార్వతి, లలిత, రాజేశ్వరి, గుంటమ్మ, కృష్ణవేణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News