నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఫిబ్రవరి 23 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ఫిబ్రవరి 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ నందు రైతాంగానికి ప్రాధాన్యత నివ్వకుండా, ముఖ్యంగా కౌలు రైతులకు తీవ్ర నిరాశకు గురిచేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా, సిపిఐ,రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం బి.కొత్తకోట మండల కార్యాలయం ముందర నిరసన తెలిపి,తహాసిల్దార్ బావా జన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.క్రిష్ణప్ప,నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ; మొత్తం రూ॥ 3.33 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ రంగాలకు కేవలం రూ॥ 53,752 కోట్లు మాత్రమే కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ' పథకానికి గతంలో రూ॥ 9,400 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ॥ 6,660 కోట్లకు తగ్గించారని,రాష్ట్రంలో మెజారిటీ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. వడ్డీ రాయితీకి రూ॥ 2,000 కోట్లు అవసరమైతే కేవలం రూ॥ 250 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ॥ 3,000 కోట్లు అవసరమైతే కేవలం రూ॥500 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన చెందారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి నిధులు సున్నాగా వుండటం వల్ల రైతులు అభద్రతకు గురవుతున్నారని,పశుసంవర్ధక,మత్స్య,ఆక్వా, సెరికల్చర్ వంటి ఉపాధినిచ్చే రంగాలకు ఆశించిన ప్రాధాన్యత లభించలేదనన్నారు.రాష్ట్ర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 50%, వ్యవసాయరంగానికే ప్రత్యేకంగా కనీసం 10% నిధులను కేటాయించాలని,గత మరియు ప్రస్తుత సంవత్సర అన్నదాత సుఖీభవ పథకం బకాయిలు సుసుమారు రూ॥27,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని,భూమి లేని కౌలు రైతులకు రావాల్సిన సుమారు రూ॥ 3,500 కోట్ల బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని,ఎన్నికల వాగ్దానం మేరకు నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని,ధరల స్థిరీకరణకు రూ॥ 3,000 కోట్లు,వడ్డీ రాయితీకి రూ॥ 2,000 కోట్లు మరియు ఉచిత పంట బీమాకు రూ|| 2,000 కోట్లు కేటాయించాలని,మైనర్ ఇరిగేషన్ పనులకు కనీసం రూ॥ 5,000 కోట్లు కేటాయించాలని,రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు నిధులుకేటాయించాలని,ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించి వారిని ఆదుకోవాలని,కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి నిధులు పెంచేలా ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం మండల నాయకులు పి. నారాయణస్వామి, గంగన్న,శంకర, నరసింహులు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News