నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 14 : రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులలో తంబళ్లపల్లె మండలానికి తీవ్ర అన్యాయం జరిగినట్లు పెద్దేరు ప్రాజెక్ట్ చైర్మన్ కొట్టాల శివకుమార్ తోపాటు చెరువుల సంఘం అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి 397 కోట్లు మంజూరు కాగా తంబళ్లపల్లె నియోజకవర్గానికి కోటి మంజూరు అయింది. బి.కొత్తకోట మండలంలోని చెరువులకు రూ24.68 లక్షలు, కురబలకోట కు రూ 25.30 లక్షలు, పెద్దమండెం కు రూ 21.60 లక్షలు, తంబళ్లపల్లెకు రూ 11.40 లక్షలు, మొలకలచెరువుకు రూ 6 లక్షలు మంజూరయ్యాయి. చెరువులకు నిధుల మంజూరులో వివక్ష చూపారని పలు మండలాల చెరువు సంఘం అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురబలకోట మండలంలో మూడు చెరువులే ఉంటే నాయన చెరువు కు రూ9 లక్షలు, పాకాల మంద చెరువుకు రూ 8.30 లక్షలు, రంగమ్మ చెరువు రూ8 లక్షలు మంజూరు అయ్యాయి. ములకలచెరువు మండలంలో 8 చెరువులకు గాను సోంపల్లి పెద్ద చెరువుకు ఆరు లక్షలు మాత్రమే కేటాయించారు. తంబళ్లపల్లె మండలంలో జిల్లాలోనే ప్రాధాన్యం గల నాలుగు వేల ఎకరాల సాగు కలిగిన పెద్దేరుప్రాజెక్టు కు ఒక్క పైసా విదల్చకపోగా మరో 11చెరువులకు గాను బయమ్మ చెరువుకు రూ5.50 లక్షలు, గుండ్లపల్లి చెరువుకు రూ 5.90 లక్షలు మంజూరు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. పెద్ద తిప్ప సముద్రం మండలంలో ఏడు చెరువులకు గాను రంగసముద్రం చెరువుకు రూ 5.22 లక్షలు, కందుకూరు వ్యాసరయ సముద్రం కు రూ 5.80 లక్షలు మంజూరు చేశారు. బి కొత్తకోటలో ఐదు చెరువులతో గాను కొమ్మ చెన్నయ్య చెరువుకు రూ8.09 లక్షలు, బీరంగి నాగల చెరువు కు రూ8.02 లక్షలు, బడి కాయల పల్లి పెద్ద చెరువుకు రూ 8.57 లక్షలు మంజూరు చేశారు. పెద్దమండెం మండలంలో ఎనిమిది చెరువులకు గాను లంప వంక చెరువు కు రూ7.10 లక్షలు, గోరిమిల్ల కుంట కు రూ 7.30 లక్షలు, తిప్పిరెడ్డి చెరువు కు రూ 7.20 లక్షలు మంజూరయ్యాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం లో చెరువులకు మంజూరైన నిధుల విషయమై పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పలు చెరువులు మరమ్మతులకు నోచుకోక పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని నిధుల మంజూరులో పారదర్శకత లోపించిందని విమర్శించారు. పెద్దేరు ప్రాజెక్టులో రోడ్డు, పార్కు దుస్థితి, కాలువల దుస్థితి, శిథిలావస్థలోని క్వార్టర్స్ ఇంకా పలు సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా ఒక్క పైసా కేటాయించకపోవడం విచారకరమని నిధులు లేక ఆయకట్టు రైతుల వద్ద చివాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అభివృద్ధి చేయలేని ఈ పదవులు మాకెందుకని ఆవేదన వ్యక్తం చేశారు
Reporter
Namitha News