నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: పోలీసు వృత్తి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత అని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పేర్కొన్నారు. మంగళవారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో సాయుధ పోలీసు బలగాల (AR) కోసం ఏర్పాటు చేసిన రెండు వారాల వార్షిక 'మొబిలైజేషన్' శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలీసులు తమ విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను మరియు వృత్తి నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇతర వృత్తుల కంటే పోలీసు వృత్తి భిన్నమైనదని, ప్రజల ఆశలను వమ్ము చేయకుండా అత్యంత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఏటా నిర్వహించే ఈ శిక్షణ ద్వారా సిబ్బంది ఫిజికల్ ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తిరిగి గుర్తుచేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శిక్షణతో పాటు సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ గారు వెల్లడించారు. బి.డి టీమ్, పి.ఎస్.ఓలు మరియు డ్రైవర్లు తమ నైపుణ్యాలను మరింత పదును పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ రెండు వారాల పాటు ఏఆర్ సిబ్బందికి ఈ క్రింది అంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.. స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్ మరియు ఆర్మ్స్ డ్రిల్. గార్డ్ డ్యూటీ విధులు, 303 వెపన్, SLR వెపన్, AK-47 వెపన్, పిస్టల్, గ్రెనేడ్ మరియు గ్యాస్ గన్ల వాడకంపై శిక్షణ. మాబ్ కంట్రోల్ (జనసమూహ నియంత్రణ), బందోబస్తు విధులు, విఐపి సెక్యూరిటీ మరియు ఎస్కార్ట్ విధులు. పికెట్ డ్యూటీలు, చెక్ పోస్ట్ నిర్వహణ మరియు రోప్ పార్టీ విధులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, ఏఆర్ డీఎస్పీ శ్రీ డి. ఏడుకొండల రెడ్డి గారు, ఆర్ఐలు వి.జె. రామకృష్ణ, యం. పెద్దయ్య, ఆర్ఎస్ఐలు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News