నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మిట్స్ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్వస్థత హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో యూనివర్సిటీ విద్యార్థులు, బోధనా మరియు బోధనేతర సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం మరియు చెడు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కనీసం ఆరు గంటలపాటు నిద్రకు సమయం కేటాయించడం వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని పేర్కొన్నారు. స్వస్థత హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ శశికళ (జనరల్ మెడిసిన్), డాక్టర్ శ్వేత మహేశ్వరీ (గైనకాలజీ), డాక్టర్ కీర్తిష్ (ఆర్థోపెడిక్) విభాగాలకు చెందిన వైద్యులు విద్యార్థులు మరియు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ టి.జి రవి కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News