నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. 2011 బ్యాచ్కు చెందిన ఆయన గత 15 ఏళ్లుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సమర్థుడైన కానిస్టేబుల్ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల కోసం ఎస్పీ తరఫున రూ.1 లక్ష నగదును మృతుని సతీమణి ప్రమీలకు అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం రాయచోటి మండలం మాసాపేట రెడ్డివారిపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఏఆర్ పోలీసు బృందం గాలిలోకి కాల్పులు జరిపి 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో కడసారి గౌరవ వందనం సమర్పించింది. అంతిమయాత్రలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
Reporter
Namitha News