నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా అట్లుంటది మనతోని సినిమా షూటింగ్ ప్రారంభం - వినోదాత్మక ప్రేమ కథాచిత్రమని దర్శకులు రామ్ సుంకర వెల్లడి - పోస్టర్స్ ఆవిష్కరించిన చిత్రబృందం మదనపల్లె : 'అట్లుంటది మన తోని' చలన చిత్రం శుక్రవారం మదనపల్లె పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా షూటింగ్ ప్రారంభమైంది.అనంతరం స్థానిక సొసైటీ కాలనీలోని కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా దర్శకులు,హీరో హీరోయిన్,నిర్మాతలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా చిత్ర దర్శకులు రామ్ సుంకర మాట్లాడుతూ ఈ చిత్రం వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించడం జరుగుతుందని తెలిపారు.ఇందులో కథానాయకగా ముంబయికి చెందిన రిచా జోషి,కథా నాయకుడిగా వినయ్ నటిస్తున్నారని తెలిపారు.అంతే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటులు ఈ చిత్రంలో నటించబోతున్నారని చెప్పారు.మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని,అలాగే ఇతర ప్రాంతాల్లో పాటలు తీయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి కుటుంబంలో అందరూ కలిసి చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.ఈ చిత్రం హీరో,హీరోయిన్ వినయ్,రిచాజోషిలు మాట్లాడుతూ మొదటిసారిగా వెండితెర మీద హీరో హీరోయిన్లుగా రాబోతున్నట్లు తెలిపారు.ఇందుకు అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు దర్శకులకి ధన్యవాదాలు తెలిపారు.ఈ చిత్రం ప్రేక్షకుల మనసును దోచుకుని మంచి చిత్రంగా గుర్తింపు పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.చిత్ర నిర్మాత రాటకొండ రవితేజ నాయుడు మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకొని ఎక్కడ రాజీపడకుండా,మంచి చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం జరుగుతుందన్నారు.ఈ చిత్రం ద్వారా మదనపల్లెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News