నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 30 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏబీజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (IEI) స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో క్వాలిటీ మైండ్ సెట్ అండ్ టెస్ట్ ఆటోమేషన్ అనే అంశంపై రెండు రోజుల పాటు హాండ్స్ ఆన్ వర్కుషాపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై కి చెందిన సి.జి.ఐ ఇన్ కార్పొరేషన్ కంపెనీ కన్సల్టింగ్ డెలివరీ మేనేజర్ వినోత్ కుమార్ బోజరాజ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సాఫ్ట్వేర్ అభివృద్ధి దశలో ముందుగానే నాణ్యతపై దృష్టి పెట్టాలని, డెవలపర్స్, టెస్టర్స్, బిజినెస్ అనలిస్ట్స్ అందరూ కలిసి పనిచేస్తే మంచి నాణ్యత గల ఫలితాలు వస్తాయని తెలిపారు. క్వాలిటీ మైండ్ సెట్ ద్వారా సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రారంభ దశ నుంచే నాణ్యతపై దృష్టి పెట్టడం, లోపాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తెలుసుకోవడం ద్వారా వినియోగదారులకు నమ్మకమైన, సురక్షితమైన మరియు స్థిరమైన సాఫ్ట్వేర్ను అందించవచ్చు. కేవలం చివరిదశలో టెస్టింగ్ చేయడం కాకుండా, ప్రతి డెవలప్మెంట్ దశలో నాణ్యతను కాపాడడం వల్ల సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అన్నారు. అలాగే టెస్ట్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ నాణ్యతను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ, ఆటోమేషన్ టూల్స్ సహాయంతో టెస్టింగ్ను వేగంగా, ఖచ్చితంగా నిర్వహించవచ్చు అని తెలిపారు. టెస్ట్ ఆటోమేషన్ ద్వారా మాన్యువల్ టెస్టింగ్ను ఆటోమేటిక్గా చేయడానికి ఉపయోగపడే టూల్స్, డేటా , కీవర్డ్ వంటి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ ను జావా, పైథాన్ వంటి సాధనాలకు అవసరమైన నైపుణ్యాలు, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏఐ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ మరియు సమస్య పరిష్కరాలపై హాండ్స్ ఆన్ కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఉన్న కెరీర్ అవకాశాలు, క్వాలిటీ ఆటోమేషన్ ద్వారా విద్యార్థులు సాధించగల అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీన్ -స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్త, విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి, కోఆర్డినేటర్స్ కె.సెంథిల్ కుమార్, ఆర్. విజయగంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News