నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 08 : వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొని జయప్రదం చెయ్యాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేదలకు ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి పేదల పొట్టగొట్టే వి.బి.జి.ఆర్.ఎ.ఎ.ఎం.జి పేరుతో కొత్త చట్టం తెచ్చిందని అన్నారు. కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను 4 కోడ్లుగా కుదించారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుధీర్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా గ్రామ సీమల అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పులిమి వెంకటరమణ, గాలివీటి రామాంజులు, చుక్క వీరభద్ర, వండాడి రెడ్డి సుధాకర్, పరసా రెడ్డి ప్రసాద్, చాగలేటి ఆంజనేయులు, బాబు రమేష్, మక్ధూమ్ బాషా, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News