నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను సంయుక్త కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., జిల్లాలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత వైద్య సేవా కేంద్రాలు, సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడంతో పాటు, హెచ్ఐవి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పరీక్షా సామగ్రి, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, సమిష్టి కృషితో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ మరియు కుష్టు నివారణ అధికారి డాక్టర్ రాధిక, కార్యక్రమ సమన్వయ అధికారి వి. భాస్కర్, జిల్లా సహకారశాఖ అధికారి త్యాగరాజు, వ్యవసాయ శాఖ జేడి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News