నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సుందరీకరణకు రూ.20 లక్షలు బహుద కాలువ గట్లపై ఇనుప బ్యారిగేట్లు.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా కేంద్రంగా అభివృద్ధి దిశగా మదనపల్లె పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని బహుద కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇనుప బ్యారిగేట్లు, పూల కుండీలతో అలంకరించిన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బహుద కాలువ గట్లపై ఐదు ప్రాంతాల్లో రూ.20 లక్షల వ్యయంతో ఇనుప బ్యారిగేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ అందాన్ని పెంచేలా పూల మొక్కలను కుండీల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రోడ్ల విస్తరణ పనులతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు పట్టణ రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన పలు సమస్యలను ప్రస్తుతం దశలవారీగా పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ రహిత మదనపల్లె లక్ష్యంగా ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి సహకరించాలని కోరారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత డ్రైనేజీలను పునర్నిర్మిస్తూ పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మదనపల్లె అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న ఎమ్మెల్యే, పనుల అమలులో కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల తో పాటు సంబంధిత అధికారులను అభినందించారు. అభివృద్ధి పనుల ద్వారా మదనపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Reporter
Namitha News