నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి,జూన్ 22:అన్నమయ్య జిల్లా,సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో 2014లో నమోదైన మైనర్ బాలిక అపహరణ,అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సోమవారం (22.06.2026) తీర్పు వెలువరించింది.చిత్తూరులోని ఇన్ఛార్జి పోక్సో కోర్టు జిల్లా జడ్జి అరుణ సారిక ఈ కేసును విచారించి నిందితుడికి జైలు శిక్షతో పాటు అదనంగా రూ.16,000 జరిమానా కూడా విధించారు. సదుం మండలం చింతమాకులపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గురికానివారిపల్లెకు చెందిన 17 సంవత్సరాల బాలిక, 2014 మే 24న టీటీసీ కోచింగ్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైంది.బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదుం పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా (క్రైం నెం.58/2014) నమోదు చేశారు. తదుపరి విచారణలో మరియు బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. గుట్టమీదపల్లి గ్రామానికి చెందిన వగళ్ళ కామాందుడు మోహన్ రెడ్డి ఆ బాలికను మోసపూరితంగా తన ఆటోలో ఎక్కించుకుని అపహరించాడు.అనంతరం ఆమెను అక్రమంగా నిర్బంధించి, బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 366(ఏ), 376, 342 తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 3 రెడ్ విత్ 4 లను అదనంగా చేర్చి దర్యాప్తును వేగవంతం చేశారు.2014 జూన్ 8న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన దర్యాప్తు అధికారులు, విచారణ పూర్తి చేసి అదే ఏడాది నవంబర్ 28న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. చిత్తూరులోని గౌరవ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (POCSO S.C. No.52/2014) ఈ కేసును విచారణకు స్వీకరించింది.ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి నేడు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు.గతంలో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులను, ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసును విజయవంతంగా నడిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వి.మోహనకుమారి, మదనపల్లి డీఎస్పీ బి.పావని, పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, సదుం ఎస్ఐ విష్ణు నారాయణ, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, కోర్టు కానిస్టేబుల్ తో పాటు విచారణకు సహకరించిన బాధితురాలు, సాక్షులను అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఒక బలమైన సందేశాన్నిచ్చారు.మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇలాంటి అమానుషాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.నేరస్తులు ఎంతటి వారైనా సరే వారిని చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చేయడంలో పోలీసు వ్యవస్థ నిరంతరం శ్రమిస్తుంది. ఈ పదేళ్ల జైలు శిక్ష తీర్పు సమాజంలో నేరాలకు పాల్పడేవారికి ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది.భవిష్యత్తులోనూ మహిళా సంరక్షణే ధ్యేయంగా,నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.
Reporter
Namitha News