నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట స్ఫూర్తి, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పేర్కొన్నారు. గురువారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ... తెలుగు నేలలో జన్మించి, స్వాతంత్ర్య సమరంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మహనీయుడని కొనియాడారు. అటవీ సంపదను కాపాడడం, గిరిజనులకు హక్కులపై అవగాహన కల్పించడం, వారిని చైతన్యవంతులను చేయడం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. అల్లూరి పోరాట ఫలితంగానే గిరిజన సంక్షేమం, అటవీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అల్లూరి చూపిన సేవా మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, డ్వామా పీడీ వెంకటరత్నం, స్టెప్ అధికారి నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News