నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ పై మరో జూనియర్ అసిస్టెంట్ స్కానింగ్ రూమ్ లోనే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే వ్యక్తి మరో మహిళా జూనియర్ అసిస్టెంట్ పై బుధవారం ఉదయం స్కానింగ్ రూములోనే భౌతిక దాడికి తెగపడ్డాడు. రోగులు, అటెండర్లు ఇతర ఆస్పత్రి సిబ్బంది గమనించి జూనియర్ అసిస్టెంట్ ని కాపాడి అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే వారికి రోస్టర్ విధానంలో డ్యూటీలు మారుస్తారు. అయితే అతనికి మాత్రం ఒకే చోట డ్యూటీలు వేస్తుండటంపై ఇతర జూనియర్ అసిస్టెంట్లు అభ్యంతరం తెలిపారు. అయితే ఆ జూనియర్ అసిస్టెంట్లకు గాయపడిన జూనియర్ అసిస్టెంట్ సమాచారం అందిస్తుందన్న సాకుతో సూపరింటెండెంట్ ఛాంబర్ లోని సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి ఆమె స్కానింగ్ రూమ్ లోకి వెళ్ళడం గమనించి నేరుగా స్కానింగ్ రూమ్ కే వచ్చి విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని తెలిసింది. గతంలో కూడా పలుమార్లు సాయి సదరు మహిళపై భౌతిక దాడి చేయడం జరిగిందని బాదితులు తెలిపారు. కేసు పెట్టచ్చు కద అని ప్రశ్నించగా ఎవరూ అండగా లేరని తదనంతరం తిరిగి ఏదైనా చేస్తాడనే భయంతో మిన్నకుండిపోయాం అన్నారు. అతను తన పలుకుబడితో మిగిలిన జూనియర్ అసిస్టెంట్ల రోస్టర్లు కూడా మార్చేస్తున్నాడని సమాచారం అందింది. అయితే బాధితురాలిని భయపెట్టి ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా ఆస్పత్రిలో కొందరు గట్టి ప్రయత్నాలు చెయ్యడంతో బుదవారం జరిగిన దాడి విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం పై ఆర్ఎంవో డాక్టర్ రాధిక ను వివరణ కోరగా తన దృష్టికి దాడికి సంబందించిన ఎలాంటి ఫిర్యాదు రాలేదని , బాధితురాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు
Reporter
Namitha News