నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రేక్షకులను అలరించిన 'వినుర వేమ' నాటకం యోగి వేమన జీవిత చరిత్రను ఆవిష్కరించిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు విశాలాంధ్ర, మదనపల్లి: భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) సౌజన్యంతో, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ సమర్పణలో స్థానిక సీఎస్ఐ కమ్యూనిటీ హాల్లో ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్ర ఆధారంగా ప్రదర్శించిన 'వినుర వేమ' ఆధునిక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్తో కలిసి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఇన్చార్జి జగ్గరాజు, రోజా హోటల్స్ అధినేత కంభం నాగభూషణ్ రెడ్డి, విశ్రాంత ఎంఈఓ పోతబోలు రెడ్డెప్ప, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వార్డెన్లు వెంకటేష్, విజయ్కుమార్, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందు, గిరిజన సమాఖ్య అధ్యక్షుడు దివాకర్ తదితరులు యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రజాకవి యోగి వేమనకు చిరస్థాయి స్థానం ఉందన్నారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా తత్వవేత్త, సంఘ సంస్కర్త, యోగి, మానవతావాది అని కొనియాడారు. తన పద్యాల ద్వారా కులమత వివక్ష, మూఢనమ్మకాలు, కపటత్వం, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ సమానత్వం, సత్యం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో చాటిచెప్పారని పేర్కొన్నారు. 'వినుర వేమ' నాటకంలో వేమన బాల్యం నుంచి యోగిగా ఎదిగిన జీవన ప్రయాణం, సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం, సమానత్వం, నీతి, సత్యంపై ఆయన బోధనలు హృద్యంగా ఆవిష్కరించబడ్డాయి. "ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల? భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధి లేని శివపూజలేలరా? విశ్వదాభిరామ వినుర వేమ" వంటి ప్రసిద్ధ వేమన పద్యాలను నృత్య, గాన రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వేమన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాస్ ప్రతినిధులు ముత్యాల మోహన్, నీరుగట్టి రమణ, గంగాధర్, శశిధర్, బండకోట రవి, జి.వి. రమణ, సొన్నికంటి రెడ్డెప్పతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News