నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని ఇన్ పేషెంట్లు పెరగడానికి కృషి చేయాలని డిసిహెచ్ఎస్ లక్ష్మీకర్ సూచించారు. సోమవారం ఆయన తంబళ్లపల్లి సిహెచ్సీని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులు, బాలింతల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే యూనిట్, గోపి యూనిట్ పరిశీలించారు. ఆసుపత్రిలో హాజరవుతున్న ఓపి రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలు, రాత్రిపూట వైద్య నిర్వాహణ, రోగులకు అందిస్తున్న ఉచిత భోజనం సౌకర్యం తదితరాంశాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా రోగుల సంఖ్య పెరగకపోవడం పై అధ్యయనం చేస్తామని, త్వరలో పోస్టుమార్టం నిర్వహణకు చర్యలు చేపడతామని, చిన్న చిన్న వైద్య సమస్యలపై చీటికిమాటికి మదనపల్లి కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి లోపల ఎక్కడపడితే అక్కడ చెత్త బాక్సులు వేరాదని పారిశుధ్యం పాటించాలని ఆస్పత్రి పరిసరాలు దోమల నివారణతో పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నారు. రాత్రిపూట వచ్చే డెలివరీ కేసులు, యాక్సిడెంట్ కేసులు వైద్యానికి డాక్టర్ కచ్చితంగా ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. ఆసుపత్రిలో డెలివరీలు పెంపుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి లో అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించినట్లు తెలిపారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ తేజస్వి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News