నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 24 : తంబళ్లపల్లి మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలోని రైతులకు ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి వారికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టినట్లు పోర్డు డైరెక్టర్ జె.లలితమ్మ తెలిపారు. ఆదివారం స్థానిక ఎంపీపీ స్కూల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, నేటి రసాయన ఎరువుల వ్యవసాయ దుష్ప్రభావాలు పై ఆమె రైతులకు అవగాహన కల్పించారు . నాడు ప్రకృతి వ్యవసాయం లో భాగంగా కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, రాగి సంగటి, నాటు కోడి, గుడ్లు, కూరగాయలు, దేశీయ పశువుల పాలు, పెరుగు, నెయ్యి బలమైన ఆహారంతో మన పెద్దలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని తెలిపారు. నేడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ప్రభావంతో పండిన పంటలతో ఆరోగ్యాలు క్షీణించి రోగాలతో ఆస్పత్రిపాలవుతున్నట్లు చెప్పారు. నాడు పంటలకు భూసారానికి పేడఎరువు, ఆకుల ఎరువులు,కషాయాలతో పండిన పంటలతో సంపూర్ణ ఆరోగ్యం సంకల్పిస్తుందన్నారు. నేడు పెట్టుబడిదారీ వ్యవస్థలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పుట్టగొడుగుల్లా వ్యాపించి మానవాళికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. మన భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతి వ్యవసాయం తో మానవ మనువాడకు జీవం పోయడానికి గుండ్లపల్లి పంచాయతీలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో గుండ్లపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటుతోపాటు రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం నాడు నేడు పరిస్థితులపై అవగాహనతో పాటు రాబోయే ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయాన్ని వ్యాప్తి చెందేలా రైతుల్లో చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈ బృహత్ కార్యక్రమానికి టెక్నికల్ గా ఏపీ సీఎన్ ఎఫ్, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ, ఉద్యానవన శాఖ, మహిళా సంఘాల సహకారంతో ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి కృషి చేస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతులలో పోర్డు కోఆర్డినేటర్ పివి రమణ, ఆర్గనైజర్ రెడ్డి రాణి, అనిత, నరసింహులు, బిఆర్సి సెంటర్ విశ్వనాథ్, ఏపీసిఎన్ఎఫ్ రెడ్డప్ప, లలిత, జైపాల్ నాయుడు, శ్రీరాములునాయుడు, పెద్దపల్లనాయుడు, నరసింహులు, వేటా మల్లికార్జున రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News