నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : మదనపల్లి పట్టణంలో త్రాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ కూడళ్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రాపర్టీ టాక్స్ మరియు వాటర్ టాక్స్ వసూళ్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మదనపల్లి పట్టణ ప్రత్యేక అధికారి మరియు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ప్రస్తుత జనాభా, త్రాగునీటి అవసరాలు, పనిచేస్తున్న బోర్వెల్లు, చేతిపంపులు, నీటి ట్యాంకుల వివరాలు, వేసవికాలంలో త్రాగునీటి సమస్యల నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామారావు కాలనీ, రెడ్డీస్ కాలనీ, మారుతి నగర్, వీక్లీ మార్కెట్ ప్రాంతాల్లో 14 బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా 7 కొత్త బోర్లు తవ్వి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు. అదనంగా మరికొన్ని బోర్ల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు నీటి నాణ్యత పరీక్షలను తరచూ నిర్వహించి ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు విధుల్లో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్లు, కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విధులకు అనధికారికంగా గైర్హాజరయ్యే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మున్సిపల్ పార్కులు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి బకాయిల వివరాలు తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, పారదర్శకంగా పన్నుల వసూళ్లు చేపట్టాలని సూచించారు. టాక్స్ చెల్లింపుల ద్వారా రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సేవలు మెరుగుపడతాయని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి వార్డు వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇంజనీరింగ్ డి ఈ శ్రావణి, పబ్లిక్ హెల్త్, ప్రాపర్టీ టాక్స్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News