నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అరాచకాలు చేసే వారికి అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు - మదనపల్లి అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి చేసింది శూన్యం - ఉనికి కోసం వైఎస్సార్సిపీ నాయకుల ఆరాటం - ఘాటుగా విమర్శించిన తెలుగుదేశం నాయకులు మదనపల్లె : అరాచకాలు చేసే వారికి అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదని,మదనపల్లి అభివృద్ధికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.మంగళవారం మదనపల్లి టిడిపి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులునాగూర్ వలి (షో ఆప్ శీనా),టౌన్ జనరల్ సెక్రటరీ రామాంజనేయులు,క్లస్టర్ ఇంచార్జి కదిరి రాజ్ కుమార్,యూనిట్ ఇంచార్జి కొప్పల హరినాథ్,తెలుగు యువత ప్రణయ్ రాయల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందన్నారు.ఆ పార్టీ నాయకుల అరాచకాలు,దౌర్జన్యాలకు అంతు లేదని తద్వారా రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి లేదన్నారు.2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి అన్నదమ్ముల్లాగా అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముకాభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు.అన్నదాత సుఖీభవ,తల్లికి వందనం,ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,అన్న క్యాంటీన్లు,స్త్రీ శక్తి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.ప్రజా రాజధాని అమరావతి,ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.ఇకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రుషికొండలో నిర్మించిన విలాసమైన భవనాల కోసం నిధులు దుర్వినియోగం చేస్తున్నపుడు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.మదనపల్లి ప్రజలు ఎంపీ మిథున్ రెడ్డిని మూడు పర్యాయాలు గెలిపిస్తే మదనపల్లికు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా,ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజల దశాబ్దాల కల అయిన మదనపల్లి జిల్లాను సాకారం చేశారని,దానిని జీర్ణించుకోలేకనే అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారని విమర్శించారు.అంతేకాకుండా ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో మదనపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.గతంలో చారిత్రాత్మక బీటి కళాశాలను యూనివర్సిటీ చేసినట్లు హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టించారన్నారు.కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు.ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తూ మాట్లాడడం దురదృష్టకరమన్నారు.త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో తమ ఉనికిని కాపాడుకోవడానికి వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని,వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,మరో 20 ఏళ్లపాటు ఏపీలో కూటమి పాలన కొనసాగడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎంపీ మిథున్ రెడ్డి,ఆ పార్టీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు.
Reporter
Namitha News