నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : అన్నమయ్య జిల్లాలోనే తంబళ్లపల్లెకు సమీపంలోనే పెద్దేరు ప్రాజెక్టు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సుమారు 5 వేల ఎకరాల సాగు తో తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాల్లోని సుమారు పదివేల మంది రైతులు, కూలీలకు జీవగర్ర గా నిలిచింది. ప్రాజెక్టు నిండితే ప్రాజెక్టుతో పాటు పార్కులు సందర్శనకు ప్రతిరోజు వందలాదిమంది పర్యాటకులతో కళకళ లాడుతుంది. అయితే ప్రాజెక్టు కు వెళ్లడానికి తంబళ్లపల్లె-పెద్దమండెం ప్రధాన రహదారి నుండి రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ప్రాజెక్టు వద్ద గతంలో నిర్మించిన గెస్ట్ హౌస్, పంప్ హౌస్, క్వార్టర్స్ శిధిలావస్థకు చేరుకున్నాయి. పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో నేటి ప్రాజెక్టు, పార్కు, రోడ్డు మరమ్మతులకు పాల కవర్గం నిధులు లేక చేతులెత్తేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద సౌకర్యాల లేమితో సందర్శకులు నిరాశ, నిస్పృహ ప్రదర్శిస్తున్నారు. పెద్దేరు ప్రాజెక్టుతో పాటు పార్కులు సుందరీకరణ, పిల్ల కాలవల మరమ్మతులు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు,మౌలిక వసతులు, బోటింగ్ సిస్టం, గెస్ట్ హౌస్ నిర్మాణాలు, రెయిన్ గేజ్ ఏర్పాటు,నిరంతర విద్యుత్తు ఏర్పాటు చేస్తే ప్రతిరోజు పర్యాటకుల సందర్శనతో పాటు ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలో చేప పిల్లల పెంపకం ప్రాజెక్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు జీవనోపాధి ఏర్పడుతుంది. పెద్దేరు ప్రాజెక్టు కు పూర్తిస్థాయిలో ఈ సౌకర్యాల కల్పనకు సుమారు రూ 10 కోట్లు నిధులు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు, పర్యాటక శాఖ అధికారులు స్పందించి ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్ట్ కు పూర్వవైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతులు, కూలీలు, రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News