నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 27: త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలతో, అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు* ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ గారు వెల్లడించారు. పండుగ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లాలోని పోలీస్ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని, ముఖ్యంగా సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, మొబైల్ పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల్లో భద్రతాభావం కల్పిస్తున్నామన్నారు. పండుగ పూట ఎలాంటి అపోహలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా స్థానిక స్థాయిలో ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. మరోవైపు సామాజిక మాధ్యమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికల్లో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా గానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గానీ అభ్యంతరకర పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాన్ని 24 గంటల పాటు అప్రమత్తం చేశామన్నారు. పండుగ రోజున ప్రార్థనా స్థలాలు, రద్దీగా ఉండే ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నామని, ప్రజల వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలియచేసారు
Reporter
Namitha News