నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మే 21: పీలేరు మండలంలోని అయ్యప్పనేని చెరువును గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యాటక, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి, చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో విశ్రాంతిగా గడిపేలా చెరువు కట్టపై పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, కూర్చునే సౌకర్యాలు కల్పించే అంశాలను ప్రతిపాదనల్లో పొందుపరచాలని ఆదేశించారు. అలాగే పింఛా నది నుంచి అయ్యప్పనేని చెరువుకు నీరు చేరేలా సుమారు 2.50 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పైపులైన్ ఏర్పాటుతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టం కూడా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే జిల్లా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై చిన్నారుల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందువల్ల చెరువు పరిసర ప్రాంతం కుటుంబాలతో కలిసి సందర్శించదగిన ప్రజా వినోద కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు
అధికారుల అంచనా ప్రకారం పైపులైన్ ఏర్పాటుకు సుమారు రూ.3 కోట్లు, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు సుమారు రూ.46 లక్షల వ్యయం కావచ్చని అధికారులు వివరించారు. జిల్లాలో నీటి వనరుల సంరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఇరిగేషన్, డ్వామా, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News