నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవన కార్మికుడు బలవన్మరణం కుటుంబంలో విషాదం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువుల విజ్ఞప్తి విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో భవన కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం వెలుగు చూసింది. రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక నిమ్మనపల్లె రోడ్డు దిగువ కమ్మపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న లేట్ నరసింహులు కుమారుడు అగరం సూరి(45) భవన కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో ఏ కారణంతోనో మనస్తాపానికి గురైన సూరి తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని, కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.
Reporter
Namitha News