నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించి... క్షయ వ్యాధి రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా, మార్చి 24, 2026 నుండి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ – 100 రోజుల కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం లో క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో కలిసి విడుదల చేశారు
ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో మూడు దశల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు . హై రిస్క్ గ్రామాలు, కాంగ్రీగేట్ ప్రదేశాలు మరియు వల్నరబుల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని స్క్రీనింగ్ నిర్వహించ బడుతుంది. ప్రతిరోజు ఒక హై రిస్క్ గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ అన్ని గ్రామాలను కవర్ చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. శిబిరాల్లో ఛాతీ ఎక్స్-రే సహా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. స్క్రీనింగ్ చేసిన ప్రతి వ్యక్తి వివరాలను నిక్షయ్ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రాధిక మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News