నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 24 : అన్నమయ్య జిల్లాలో ‘పాస్పోర్ట్ ఫిర్యాదుల పరిష్కారం & వలసదారుల సౌకర్య కేంద్రం’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. రాయచోటి జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ముఖ్యంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆలస్యం, వలసదారుల సమస్యల నమోదు, మోసపూరిత ఏజెంట్ల పై కఠిన చర్యలు వంటి సమస్యలకు పరిష్కారం అందించనుంది. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, “మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే మా లక్ష్యం. ఉపాధి కోసం, ఉన్నత చదువుల కోసం గల్ఫ్ దేశాలు మరియు ఇతర విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున పాస్పోర్ట్ వెరిఫికేషన్లో తలెత్తే సాంకేతిక సమస్యలు సామాన్యులను ఇబ్బందిపెట్టకూడదు. ఈ కేంద్రం ప్రజలకు పారదర్శక, సమర్థ సేవలు అందిస్తుంది, విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలసదారులకు భరోసాగా నిలుస్తుంది అన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, .. “ప్రజలు పాస్పోర్ట్ సమస్యల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా పాస్పోర్ట్ దరఖాస్తుల పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరిస్తాం. ఏజెంట్ల మోసానికి గురైన వలసదారులు లేదా విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షించి బాధితులకు త్వరిత న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కేంద్రం ప్రారంభంతో అన్ని వయస్సుల, వలస ప్రయాణికుల సమస్యలకు తక్షణ పరిష్కారం, భరోసా కల్పించడం ద్వారా జిల్లా ప్రజలకు కీలక సౌకర్యం అందుతోంది.
Admin
Namitha News