నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : తంబళ్లపల్లె మండల పరిషత్ అధ్యక్షురాలి ఎన్నిక ఈనెల 11వ తేదీన జరగనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ తెలిపారు. తంబళ్లపల్లె మాజీ ఎంపీపీ అనసూయమ్మ ఈఏడాది అక్టోబర్ 13న తన వ్యక్తిగత కారణాలవల్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ అనసూయమ్మ పై పదిమంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అక్టోబర్ 27వ తేదీన ఎంపీడీవో పట్నాయక్ మెజారిటీ ఎంపీటీసీల ఆమోదంతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఆదేశాల మేరకు కోసువారిపల్లి ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలు చిటికి శ్యామలమ్మను ఇంచార్జ్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు ఈనెల 11వ తేదీ 11 గంటలకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా లోని విజయపురం, నిండ్ర, తిరుపతి జిల్లా లోని ఏర్పేడు, వరదయ్యపాలెం, సత్యవేడు తో బాటు అన్నమయ్య జిల్లా లోని తంబళ్లపల్లె ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11వ తేదీ 11 గంటలకు మండలంలోని 11 మంది మెజారిటీ ఎంపీటీసీలు ఆమోదంతో ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ విలేకరులకు తెలిపారు. ఈ ఎన్నిక నిర్వహణ తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ డిఎల్డిఓ అమరనాథరెడ్డి సారథ్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపీడీవో కార్యాలయం వద్ద పఠిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News