నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పీటీఎం మండలం పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండ ఉదయ్ కుమార్ (20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్పై స్వగ్రామానికి వస్తుండగా బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైందా అనే విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు విచారణలో తేలనున్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఉదయ్ కుమార్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి మృతితో పిడింవారిపల్లె గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.ఫోటో క్యాప్షన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొండ ఉదయ్ కుమార్.
Reporter
Namitha News