నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మే 21 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల్లో నిర్వహణ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి విశాలాంధ్ర, మదనపల్లి: ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ రవితో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా, పోస్టల్ తదితర శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి కీలక సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం సెషన్ పరీక్షలు 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షలు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 9274 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5558 మంది, వోకేషనల్ కోర్సులకు 1125 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, మొత్తం 15,957 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9866112750 నంబర్కు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేయాలని, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం, త్రాగునీటి సదుపాయాలపై పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ పాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు విద్య, పోలీస్, రవాణా, విద్యుత్, వైద్య, పోస్టల్, మున్సిపల్, పంచాయతీ రాజ్, లేబర్ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని డిఆర్ఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవి, డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ శాఖ డివైఈఈ పి శ్రావణి, సర్వ శిక్ష అభియాన్ డిపిఎంఓ రమేష్ బాబు, ఆర్టీసీ డిఎం ఎం.వి.ఆర్. రెడ్డి, ఇన్స్పెక్టర్ రామాంజనేయులు, పోస్టల్ అధికారిణి సునంద, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News