నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 27 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “ఔరా–2కె26” కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోయంబత్తూరు కు చెందిన ఫౌండర్ & సి ఈ ఓ సబరినాథన్ ముత్తు, గేట్వేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పరిమితమైన అంశం కాదని, ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్ యాప్ల నుంచి ఆరోగ్య, బ్యాంకింగ్, రవాణా సేవల వరకు ఏఐ ప్రభావం విస్తరించి ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును ఏ రంగంలోనైనా సమర్థవంతంగా వినియోగిస్తే ఆ రంగం యొక్క ఉత్పాదకత మరియు నాణ్యత రెట్టింపు అవుతాయని తెలిపారు. విద్య నుంచి వైద్యం, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ఇప్పుడు ఏఐ ప్రమేయం లేని రంగం దాదాపుగా లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ సాంకేతిక విద్యార్థుల మధ్య సాంకేతిక ఆవిష్కరణలు, సహకార అభ్యాసం మరియు ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశం అని అన్నారు. విద్యార్థులు జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ ఆధారిత పరిశోధనలలో నూతన ఆవిష్కరణలు చేయాలని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఏఐ భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషితుంది అని తెలిపారు. కార్యక్రమంలో ఆధునిక సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, ప్రాజెక్ట్ ఎక్స్పోలు మరియు జనరేటివ్ ఏఐ ఆధారిత పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ కే.హేమలత, డాక్టర్ చొక్కనాథన్, పి.రఘురామన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News