నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సెక్యూరిటీ సిబ్బందిపై వివక్ష ఆపాలి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు విశాలాంధ్ర , మదనపల్లి: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని, సెక్యూరిటీ సిబ్బంది హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐటీయూసీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాధికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్యూటీ ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగిస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బందిపైన మాత్రమే ఈ నిబంధనలు అమలు చేయడం స్పష్టమైన వివక్షతకు నిదర్శనమన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానం రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ విధానం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అత్యవసర కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సంప్రదింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సెక్యూరిటీ సిబ్బందిపై అమలు చేస్తున్న వివక్షతపూరిత విధానాలను వెంటనే నిలిపివేయాలని, కార్మికుల సెల్ ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన నిబంధనలు అమలు చేయాలని కోరారు. కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్న సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందికి గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, రవి తదితరులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News