నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27: ప్రభుత్వ విధానపరమైన అంశాలన్నింటికీ జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డులోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా మరియు ఛార్జ్ స్థాయి అధికారులకు జనగణన దశ-I, గృహ జాబితా మరియు గృహ గణనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని ఖచ్చితమైన, సమగ్రమైన మరియు పారదర్శక సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇంటింటి సమాచారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలని ఆదేశించారు. సేకరించిన గణాంకాల ఆధారంగానే విద్య, వైద్యం, ఉపాధి, గృహనిర్మాణం మరియు మౌలిక వసతుల ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయని, ఆర్థిక సంఘాల నివేదికలు రాష్ట్రాలకు ఇచ్చే నిధులు వాటి అంశాలు కూడా జనగణ గణాంకాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. జన గణన గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఎమ్మెల్యే మరియు లోక్సభ స్థానాల నిర్ణయం జరుగుతుందని, సంక్షేమ పథకాల రూపకల్పన, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పారిశ్రామిక ఆస్తుల పన్నుల పరిమితులు, నీటి వనరుల లభ్యత, పారిశుద్ధ్య సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జన గణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాబట్టి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. భారతదేశంలో 1872 నుండి సంవత్సరాలుగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన నిర్వహించడం జరుగుతుందని, 2021లో నిర్వహించాల్సిన సెన్సస్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడగా, ప్రస్తుతం మళ్లీ సెన్సస్కు సంబంధించిన అన్ని కార్యాచరణలు ప్రారంభించబడ్డాయన్నారు. భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ మార్గదర్శకత్వం లో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోందన్నారు. ప్రారంభ దశలో ఒక నెలపాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపట్టడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో ప్రతి 700 నుండి 800 జనాభాకు ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్గా విభజించి వివరాలు సేకరించడం జరుగుతుందని, ప్రతి హాబిటేషన్ను ఒక యూనిట్గా పరిగణించి సమగ్రంగా గృహాల లెక్కలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈసారి జనగణనలో ప్రత్యేకంగా “సెల్ఫ్ ఇన్యూమరేషన్” విధానాన్ని ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన అంశమని, ప్రజలు స్వయంగా మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు
ఈ శిక్షణ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి మరియు పీలేరు ఆర్డీవో శ్రీనివాస్, ఏడి సర్వేయర్ భరత్ కుమార్, డిపిఓ రాధమ్మ, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్.శాఖ అధికారి లక్ష్మీపతి, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News