నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం-రాహత్' (PM-RAHAT) పథకం ఒక గొప్ప వరమని, అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ఈ 'నగదు రహిత చికిత్స' (Cashless Treatment) విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు
గోల్డెన్ అవర్.. ప్రాణాలకు ఆధారం! ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైనదిగా ఎస్పీ అభివర్ణించారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. "ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా 112 నంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. బాధితులను వెంటనే నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స ప్రారంభించవచ్చు" అని ఎస్పీ తెలిపారు. పథకం విశేషాలు ఇలా ఉన్నాయి.. ఉచిత చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది. ఏడు రోజుల పరిమితి : ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా 7 రోజుల పాటు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందవచ్చు. ఎవరెవరు అర్హులు... ? రోడ్డుపై నడిచే పాదచారులు, సైకిల్ దారులు, ద్విచక్ర వాహనదారులు, డ్రైవర్లు మరియు విదేశీయులు సైతం ఈ పథకానికి అర్హులే. నిబంధనలు : ప్రమాదం జరిగిన అనంతరం వీలైనంత త్వరగా, సాధారణంగా 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చితే పథకం ప్రయోజనాలు సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. సహాయం చేసే వారికి 'రక్ష'.. నగదు బహుమతి : ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే ‘గుడ్ సమారిటన్ (రహ-వీర్)’లకు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులను కాపాడిన వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పైగా వారి సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం రూ.25,000 వరకు నగదు బహుమతిని అందజేస్తుందని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం అందిన 24 గంటల్లోనే ప్రమాద ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు
ఎస్పీ గారి విజ్ఞప్తి మీ ఒక్క అడుగు ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని భయపడకండి. మానవత్వంతో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించి పీఎం-రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి" అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు
Reporter
Namitha News