నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 04 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లి స్వస్థత హాస్పిటల్, చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ ఆదర్శ్ రెడ్డి పాల్గొని, విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండగా భారత్లో అధికంగా ఉండడం ఆందోళనకరమని, జీవనశైలి మార్పులు, జంక్ ఫుడ్, మధుపానం, మద్యపానం, పొగత్రాగడం, అధిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం వంటి అలవాట్లు క్యాన్సర్కు ప్రధాన కారణాలని తెలిపారు. క్యాన్సర్ గొంతు, ఊపిరితిత్తులు, చర్మం, ఉదరం, బ్రెస్ట్ వంటి శరీర భాగాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అయితే మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ నాలుగు దశల్లో ఉంటుందని, ప్రారంభ దశలో చికిత్స పొందితే వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటూ తమ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సదస్సులు, చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ ఎక్కువ కాలం ప్లాస్టిక్ వినియోగం చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని. కాబట్టి ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాల వాడకాన్ని తగ్గించి, స్టీల్ లేదా గాజు పాత్రలను ఉపయోగించడం, ప్లాస్టిక్లో వేడి ఆహారం పెట్టకపోవడం, ప్లాస్టిక్ను కాల్చకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన భవిష్యత్తు తరాల వారిని క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని తెలిపారు. స్వస్థత హాస్పిటల్తో మిట్స్ యూనివర్సిటీ కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ & అసిస్టెంట్ డైరెక్టర్, ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎం. బాలాజీ, డాక్టర్ ఆర్. చెన్నయ్య , కోఆర్డినేటర్లు జి. కుమార్, డాక్టర్ బి. సింహాద్రి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News