నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమోదు లేని ఆసుపత్రులు, ల్యాబ్లపై కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం : డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబొరేటరీ తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖలో నమోదు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నమోదు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు లేదా ల్యాబ్లు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే సంబంధిత వైద్య చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన పాజిటివ్ కేసులను వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లకు సూచించారు. వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.
Reporter
Namitha News