నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 27 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు చిత్తూరులో మే 17 నుండి మే 26, 2026 వరకు నిర్వహించిన ఎన్సీసీ ఏటీసీ-III శిబిరంలో విశిష్ట ప్రతిభ కనబర్చారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ . సి. యువరాజ్ తెలిపారు. దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఫైరింగ్ శిక్షణ, అడ్డంకుల శిక్షణ, మ్యాప్ రీడింగ్, యుద్ధ నైపుణ్యాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫైరింగ్ శిక్షణ ద్వారా ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించగా, అడ్డంకుల శిక్షణ ద్వారా శారీరక సామర్థ్యాన్ని పెంపొందించారు. మ్యాప్ రీడింగ్ కార్యక్రమంలో ప్రదేశాల గుర్తింపు, దిశా నిర్ధారణ వంటి నైపుణ్యాలను నేర్పించారు. మొత్తం 594 మంది క్యాడెట్లు పాల్గొన్న ఈ శిబిరంలో క్రమశిక్షణ, సమయపాలన మరియు జట్టు భావనలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన మిట్స్ యూనివర్సిటీకి చెందిన 15 మంది క్యాడెట్లు తదుపరి శిబిరానికి ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. ఈ శిబిరానికి కమాండింగ్ ఆఫీసర్గా కల్నల్ ఎన్వి మోనిస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ సేవలందించగా, చిత్తూర్ 35 (A) ఆంధ్ర బెటాలియన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిబిరంలో ప్రతిభ కనబర్చిన ఎన్సీసీ క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ మరియు ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ అభినందించారు
Reporter
Namitha News