నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 ః మండలంలోని రెడ్డి కోట, కుక్క రాజు పల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఇప్పటికే 20 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరణ తో పాటు మరో 40ఎకరాలు రైతుల డికెటి భూములను ఎంపిక చేయడం జరిగిందని ఆ డీకేటి భూముల రైతులు అందరికీ న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హామీ ఇచ్చారు. ఈ భూముల విషయమై గత రెండు నెలల క్రితం భూముల లబ్ధిదారులు రెడ్డి కోట వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ భూముల విషయమై గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఏపీఐఐసీ భూముల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ మన ప్రాంతంలో ఏపీఐఐసీ లో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించి అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరి తద్వారా భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రైతులు సమన్వయం పాటించి భూములు ఇవ్వడానికి సహకరించాలని కోరారు. మీ భూములకు ప్రభుత్వ పరంగా పరిహారం ఎంత ఇవ్వాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కొందరు దళిత రైతులు మాకు మా పెద్దల నుండి సంక్రమించిన ఈ భూమి జీవనాధారమని ఈ భూములు పోతే ఎలా బతకాలని ఫిర్యాదు చేసి ససేమిరా అన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం రైతులు త్యాగం చేయాలని వారికి సబ్ కలెక్టర్ సర్దిచెప్పినా వినకపోవడంతో మరోమారు రైతులు ఆలోచించుకొని సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సిద్ధపడిందని మీరు పెద్ద మనుసుతో ముందుకు రావాలని వచ్చే బుధవారం మరో మారు చివరి అవకాశం రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాశీల్దారు శ్రీనివాసులు, ఆర్ ఐ ముద్దుకృష్ణ, వీఆర్వోలు సంజీవ్, నాగరాజు రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News