నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 23 : ముస్లిం ఐక్యవేదిక విద్య ఉపాధి ఆరోగ్యం మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి స్పష్టం చేశారు. ఆదివారం మదనపల్లి పట్టణం లో అన్నమయ్య మరియు కడప జిల్లాల ముస్లిం ఐక్యవేదిక గౌరవ సలహా దారులు డాక్టర్ ఎస్ కే భాష ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి హాజరై జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసి కొంతమందికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా ముస్లింలను ఓటు బ్యాంకు గానే వాడుకుని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ముస్లిం లకు అభివృద్ధిలో వాటా లేదని, సంక్షేమంలో సమానత్వం ఉండదని ముస్లింల ను పాతాళంలోకి నెట్టివేయ బడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ముస్లిం ల ఐక్యవేదిక సంపూర్ణ హక్కుల సాధన కోసం, జాతిని మేల్కొల్పే విధంగా చైతన్య పరచుతోందని గుర్తు చేశారు. ముస్లింల సంపూర్ణ సామాజిక అభివృద్ధి సాధించే దిశగా, ఐక్యవేదిక ప్రత్యేక ప్రణాళికలతో పని చేస్తూ జాతిని జాగృతం చేయడానికి ముందుకు సాగుతుందని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కు పైగా ముస్లింల సామాజిక హక్కుల సాధన కోసం ముస్లింల ఐక్యవేదిక రాజీలేని పోరాటం కొనసాగిస్తోందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం ఐక్యవేదిక బలమైన శక్తిగా నిలబడిందన్నారు. రానున్న రోజుల్లో ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం మరింత దూకుడుగా ముందుకు సాగడంతో పాటు హక్కుల కోసం పోరాడేందుకు ముందు ఉంటామన్నారు. ఈ క్రమంలోనే మదనపల్లె లో మదనపల్లి తో పాటు అన్నమయ్య జిల్లాలోను కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. ముస్లింలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడం రాజకీయ రిజర్వేషన్ల కోసం డిసెంబర్ ఒకటో తారీఖున నంద్యాల నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. మనకోసం మన అభివృద్ధి కోసం ఈ కార్యక్రమంలో ముస్లింలంతా భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అన్నమయ్య కడప జిల్లాల గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్ కే భాష మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక ద్వారా జాతిని మేల్కొల్పుతూ అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉర్దూ భాషను అధికార భాషగా గుర్తించి ప్రభుత్వ కార్యాలయాలు మరియు వ్యవహారాల్లో వినియో గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముస్లిం విద్యాభ్యాసంలో వెనుకబడి ఉండటం చేత సమాజంలో ఇప్పటికీ ముందుకు సాగలేక పోతున్నారని, ఈ విషయంలో జాతిని చైతన్య పరచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ముస్లింలకు జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ముస్లింలలోని అన్ని వర్గాలు ఐక్యంగా న్యాయమైన హక్కుల సాధన కోసం కలిసి ముందుకు సాగుదాం అని పిలుపు నిచ్చారు. పలువురు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ పిల్లలు విద్యా భ్యాసంలో వెనుకబడి ఉన్నారని వారిని మేల్కొల్పి అందరూ చదువుకునే విధంగా ప్రోత్సహించే ముందుకు తీసుకు వెళ్ళగలిగితే అన్ని రంగాలలోనూ ముస్లింలు ముందు ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఏ బావాజీ, పట్టణ కార్యదర్శి సోహెల్, పట్టణ జాయింట్ సెక్రటరీ ఎస్ బావ జాన్, మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా, కురబలకోట మండల అధ్యక్షులు ముబారక్ సాహెబ్, రామసముద్రం మండల అధ్యక్షులు ముబారక్, పీలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సమృద్దీన్, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ ముబారక్ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News