నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 17 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు కృత్రిమ మేధస్సు ఆధారిత మెటామేటిరియల్స్ – ఆధునిక సివిల్ ఇంజనీరింగ్ అనువర్తనాలు అనే అంశంపై అల్యూమిని అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు ఐ.ఐ.టి, జమ్మూ కాశ్మీర్ నందు పీహెచ్.డి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎల్.భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెటామేటిరియల్స్ అనే ఆధునిక ఇంజనీరింగ్ పదార్థాలను భూకంప నిరోధక నిర్మాణాలు, ప్రకంపన నియంత్రణ, శబ్ద నియంత్రణ, ఆధునిక బ్రిడ్జ్లు, స్మార్ట్ బిల్డింగ్ల రూపకల్పనలో వినియోగించవచ్చని తెలిపారు . సాంప్రదాయ డిజైన్ ప్రక్రియలను కృత్రిమ మేధస్సు సహాయంతో వేగవంతం చేసే మార్గాలను, ముఖ్యంగా “ఇన్వర్స్ డిజైన్” ద్వారా అవసరమైన లక్షణాలకు అనుగుణంగా మెటామేటిరియల్ నిర్మాణాలను కంప్యూటర్ ఆల్గోరిథంలతో స్వయంచాలకంగా రూపొందించే సాంకేతికతలను ఉదాహరణలతో వివరించారు. సంప్రదాయ నిర్మాణ పదార్థాలతో సాధ్యం కాని ప్రత్యేక భౌతిక లక్షణాలను ఈ మెటామేటీరియల్స్ కలిగి ఉండటంతో, నిర్మాణాల భద్రత, స్థిరత్వం మరియు పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు సహాయంతో ఈ పదార్థాల డిజైన్, విశ్లేషణ, ఆప్టిమైజేషన్ ప్రక్రియలు వేగవంతమై, ఖచ్చితమైన ఫలితాలు లభిస్తున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతమైన ఇంజనీర్లను తయారు చేయడంలో కూడా ఈ సాంకేతికత కీలకంగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు మెటామేటిరియల్స్, స్మార్ట్ స్ట్రక్చర్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ మరియు ఏ.ఐ కలయికతో భవిష్యత్తు నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా పరిశోధన, ఉన్నత విద్య, స్టార్టప్లు మరియు పరిశ్రమ సహకారాల వైపు దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ యెన్.విజయ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ కోఆర్డినేటర్స్ కె.అనిత, డాక్టర్ ప్రియంనాథ్ భౌమిక్ , విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News