నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 08 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఆధారిత ఇంటర్నల్ హ్యకథాన్ -2026 కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా మరియు విభాగాధిపతి డాక్టర్ ఎస్.వి.ఎస్ గంగ దేవి లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ పరిధిలోని డేటా, నెట్వర్క్లు, కంప్యూటర్ సిస్టమ్లు మరియు ఆన్లైన్ సమాచారాన్ని హ్యాకింగ్, సైబర్ దాడులు, మాల్వేర్ వంటి ప్రమాదాల నుంచి భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో డిజిటల్ సరిహద్దులను కాపాడటం ప్రతి సైబర్ సెక్యూరిటీ నిపుణుడి బాధ్యతగా మారిందని అన్నారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, టీమ్ వర్క్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించబడింది అని అన్నారు. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు వేదికను అందించడానికి మరియు తద్వారా నూతన ఆవిష్కరణల సంస్కృతిని మరియు సమస్య పరిష్కార ఆలోచనను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, న్యూ ఢిల్లీ వారు ప్రతి సంవత్సరము దేశం వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ముందుగా యూనివర్సిటీ లో ఇంటర్నల్ హ్యకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించి, అందులో ప్రతిభ కనపరిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ పోటీలో క్రిప్టోగ్రఫీ, వెబ్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్స్, రివర్స్ ఇంజినీరింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఆధారిత ఛాలెంజ్లను పరిష్కరించి దాగి ఉన్న రహస్య కోడ్ లను గుర్తించాల్సి ఉంటుంది అని అన్నారు. మొత్తం 8 గంటల పాటు సాగే ఈ హ్యాకథాన్లో పాల్గొనేవారు పరిమిత సమయంలో పరస్పరం సహకరించుకుంటూ సృజనాత్మక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలన్నారు. హ్యాకథాన్ను మూడు దశలుగా నిర్వహిస్తూ, మొదటి దశలో ప్రాథమిక మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, రెండవ స్థాయిలో ప్రాథమిక ఛాలెంజ్లు, మూడవ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయి భద్రతా సమస్యలను పరిష్కరించి దాగి ఉన్న రహస్య కోడ్ (ఫ్లాగ్) ను గుర్తించాలి అని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎమ్.లక్ష్మీ ప్రీతి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News