నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 15 : పోలీస్ కార్యాలయంలో గురువారం అభినవ భారవి, కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి కవిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గొప్ప సంస్కర్త త్రిపురనేని అని తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. తెలుగు సాహిత్యంలో మరియు సామాజిక సంస్కరణోద్యమంలో ఒక ధృవతార చౌదరి గారు. ఆయనకు 'కవిరాజు' అనే బిరుదు కలదు. అలాగే ఆయన పాండిత్యానికి మెచ్చి 'అభినవ భారవి' అని కూడా పిలుస్తారు. ఆచారాల పేరుతో సాగుతున్న మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో హేతువాదాన్ని ప్రచారం చేశారు. ఆయన కలం నుండి జాలువారిన 'సూతపురాణం', 'కురుక్షేత్ర సంగ్రామం', 'శంబుక వధ' వంటి రచనలు తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించాయి. పురాణాల్లోని పాత్రలను సరికొత్త కోణంలో విశ్లేషించిన ఘనత ఆయనది. లండన్ వెళ్ళి బారిస్టర్ చదివిన ఆయన, వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ, తన జీవితాన్ని సమాజ సేవకు, అక్షర సేద్యానికే అంకితం చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప మేధావి త్రిపురనేని రామస్వామి చౌదరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వి.జె.రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News