నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి : జేసీ శివ్ నారాయణ శర్మ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీలను ప్రత్యేక దృష్టితో వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రజల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి గ్రీవెన్స్పై నిరంతరం మానిటరింగ్ నిర్వహించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు అందాయి. మదనపల్లి మండలం బసినికొండ గంగమ్మ గుడి వీధికి చెందిన జి. కస్తూరి తన భర్త మరణించి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కుటుంబానికి ఎలాంటి ఆదారం లేదని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అలాగే మదనపల్లి మండలం రామాచార్లపల్లికి చెందిన శారద తన భర్త ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ బైక్ ప్రమాదంలో మరణించారని, ప్రస్తుతం రూ.2901 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారిందని, ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొత్తం 393 అర్జీలు అందగా, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News