నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 06 : రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న FLN ఉపాధ్యాయ శిక్షణలో తీవ్ర అవ్యవస్థలు నెలకొన్నాయి. సుమారు 600 మంది ఉపాధ్యాయులు హాజరవుతుండగా, వారికి సరిపడా భోజనం, తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుంచే టీ, స్నాక్స్ లేకుండా శిక్షణ నిర్వహించగా, మధ్యాహ్న భోజనం కూడా అందరికీ సరిపోక వందలాది మంది ఉపాధ్యాయులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. రెండో రోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో అసంతృప్తి మరింత పెరిగింది. ఒక్కో ఉపాధ్యాయుడిపై భోజనం, టిఫిన్, స్నాక్స్ కోసం ₹300, స్టేషనరీ కోసం ₹100 కేటాయించినప్పటికీ, నాసిరకం ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండ తీవ్రతలో సరిపడా తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ వంటి కీలక కార్యక్రమాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
Reporter
Namitha News