నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాభావంతో పనిచేయాలి ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగుల పట్ల సేవాభావంతో సిబ్బంది పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్న ఆసుపత్రిలో రోజుకు 400 మందికి పైగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది గైర్హాజరు కాకుండా విధులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సార్ షంషీర్, బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మెడికల్ షాపు రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, రెడ్డి రాయల్, చెల్లా, బాలమణి శేఖర్, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్, పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News