నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25: అన్నమయ్య జిల్లా నూతన కేంద్రమైన మదనపల్లిలో తొలిసారిగా జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బీటీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన తుది విడత పరేడ్ రిహార్సల్స్ను జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ గారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనవరి 26న బీటీ కళాశాల పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఆర్, సివిల్, ఉమెన్ పోలీస్ బలగాలు, ఎక్సైజ్ పోలీసులు, హోంగార్డ్స్, ఎన్సీసీ, మరియు స్కౌట్ విభాగాలు నుండి 10 ప్లాటూన్ లు మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం. పెద్దయ్య పరేడ్ కమాండర్ గా నిర్వహించిన కవాత్ రిహార్సల్ ను జేసి గారితో కలిసి జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. రిహార్సల్స్ లో భాగంగా ముందుగా గౌరవ వందనం స్వీకరించారు, జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల పరేడ్ ను కూడా పరిశీలించి కవాత్ ను నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు సూచించారు. వేడుకలకు హాజరయ్యే ముఖ్యఅతిధులు, ప్రజానీకానికి దేశ ఉన్నతిని చాటేలా పోలీస్ పరేడ్ సాగాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో రెట్టించిన ఉత్సాహంతో కవాతు ప్రదర్శన చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. వీటితో పాటు పోలీసులు ప్రదర్శించిన ప్రత్యేక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. కళ్ళకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా అత్యాధునిక ఆయుధాలను విడదీయడం, తిరిగి అమర్చడం వంటి విన్యాసాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. పోలీసు "వజ్ర" వాహనం, పోలీసు "శక్తి" బృందాల ప్రదర్శన, అల్లర్ల సమయంలో జనాన్ని ఎలా నియంత్రించాలి, ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలనే అంశంపై పోలీసులు చేసిన 'మాబ్ ఆపరేషన్' డెమో ఆకట్టుకుంది. నేర పరిశోధనలో కీలకమైన డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, గంభీరంగా సాగిన గుర్రపు స్వారీ ప్రదర్శనలు రేపటి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురానున్నాయి.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నూతన జిల్లా కేంద్రంలో జరుగుతున్న తొలి వేడుకలు కావడంతో ప్రజల్లో దేశభక్తి పెంపొందేలా, పోలీసు శాఖ ప్రతిష్ట పెరిగేలా ప్రదర్శన ఉండాలని పేర్కొన్నారు. మైదానానికి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులు, ప్రజలు మరియు విద్యార్థులకు తాగునీరు, గ్యాలరీ సీటింగ్, పార్కింగ్ విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులను అప్రమత్తం చేశారు. రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా లోటు రానీయకూడదని స్పష్టం చేశారు. "పోలీసుల కవాతు మరియు విన్యాసాలు దేశ భద్రత పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. రేపటి వేడుకల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి." అని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మదనపల్లి డిఎస్పి ఎస్. మహేంద్ర , ఆర్ఐలు, సీఐలు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Admin
Namitha News