నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 29 : మదనపల్లి పట్టణంలోని ముఖ్య రహదారుల్లో ఎన్క్రోచ్మెంట్లను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో తొలగింపు చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లి లో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించి ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలిసి పోలీస్ మరియు ఇతర అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ మార్గాల ప్రతిపాదన, బస్ స్టాండ్ల మార్పు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు,ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, ప్రతిపాదిత ప్రత్యామ్నాయ మార్గాలు (మళ్లింపులు), బస్ రూట్లు, పార్కింగ్ సమస్యలు, ఎన్క్రోచ్మెంట్లు, వన్-వే విధానం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం మదనపల్లెకు మారడంతో వాహనాల మరియు పాదచారుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ప్రభుత్వ సంస్థలు మరియు వాణిజ్య కేంద్రాలు కేంద్రీకృతమై ఉండటం వల్ల రోడ్డు స్థలానికి డిమాండ్ పెరిగిందని, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా, మదనపల్లి పట్టణం రవాణా వాహనాలు మరియు రోజువారీ ప్రయాణికుల వాహనాలు అధికంగా వస్తుంటాయని, దీనికనుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ మరియు రోడ్డు భద్రతా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని తెలిపారు. పట్టణంలో ఫుట్పాత్లపై వీధి వ్యాపారాలు, నియంత్రణ లేని పార్కింగ్ మరియు ఆక్రమణలు తొలగించే విధంగా చూడాలని ఆదేశించారు మదనపల్లి పట్టణంలో పాఠశాలలు మరియు కాలేజీలు దూర ప్రాంత ఉద్యోగస్తులు, వివిధ రకాల పనులపై ప్రజల ప్రయాణం కారణంగా ట్రాఫిక్ అధికంగా ఉంటుందని, ఉదయం 8:30 నుండి 10:30 వరకు చాలా ఎక్కువ గాను, ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3:00 అధికం గాను, సాయంత్రం 4:30 నుండి రాత్రి 7:30 చాలా ఎక్కువగాను, రాత్రి 7:30 నుండి రాత్రి 10:00 వరకు మద్యస్థంగాను, 10:00 గంటల నుండి తక్కువగాను, భారీ ట్రక్కుల కదలికలు జరుగుతుంటాయని అధికారులు తెలిపారు. బెంగళూరు రోడ్డు నెహ్రూ స్కూల్ నుండి సొసైటీ కాలనీ ద్వారా N.T.R సర్కిల్ వరకు వాహనాలను మళ్లించేందుకు ముఖ్య రహదారుల్లో ఎన్క్రోచ్మెంట్లను, విద్యుత్ స్తంభాలు, తీగలు గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో తొలగింపు చర్యలు చేపట్టే విధంగా చూడాలని మున్సిపాలిటీ, రెవిన్యూ, విద్యుత్తు, ఆర్టీసీ, పోలీస్ శాఖలకు సమన్వయం చేసుకొని త్వరితగతిన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. చిత్తూరు బస్టాండ్ ను పుంగనూరురోడ్ లోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ భూములను గుర్తించి వాటి సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, ఆర్టీసీ బస్టాండ్ నుండి కడప, అనంతపురం వైపుకు వెళ్లే వాహనాలను రద్దీ వేళల్లో పట్టణంలోకి అనుమతించకుండా చౌడేశ్వరి కళ్యాణ మండపం నుండి రామారావు కాలనీ గొల్లపల్లి క్రాస్ మీదుగా వెళ్లే విధంగా చూడాలని, మల్లికార్జున సర్కిల్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు MSR థియేటర్ రోడ్డు ద్వారా, చిత్తూరు బస్ స్టాండ్ నుండి చంబకూర్ రోడ్డు వయా HP గ్యాస్ ఆఫీస్ వరకు, శ్రీ మంజునాథ టెంపుల్ నుండి వయా కలెక్టరేట్ మీదుగా చిత్తూరు బస్టాండ్ కు వన్-వే గాను, నో పార్కింగ్ జోన్లుగా CTM రోడ్, బెంగళూరు బస్ స్టాండ్, సొసైటీ కాలనీ మూడు ప్రదేశాలన గుర్తించడం జరిగిందని వాటిని అమలు చేసే విధంగా సాధ్య సాధ్యాలను పరిశీలించాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి,మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆర్ అండ్ బి అధికారులు, ఆర్టీసీ డిఎం,ట్రాఫిక్ సిఐ, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News