నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఏడి సర్వే భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 348 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిజిఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించినమండలాలను, గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు క్రమశిక్షణతో పని చేయాలని తెలిపారు. ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు చౌడేపల్లి మండలం దిగువ పల్లి పంచాయతీ పరిధిలోని అప్పినేపల్లి గ్రామం కు చెందిన ఎం చిన్న రెడ్డప్ప నాయుడు తన భూమికి సంబంధించి సాంకేతిక లోపం వల్ల సమస్య వచ్చిందని మెట్ట కు బదులు పట్టాగా మార్చి వన్ బి, అడంగల్ మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కు విన్నవించు కున్నారు. కురబల కోట మండలం నందిరెడ్డి గారి పల్లి పంచాయతీకి చెందిన యస్.ముంతాజ్ ఇంటికి దారి లేక అవస్థలు పడుతున్నామని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించు కున్నారు. పెద్ద తిప్ప సముద్రం మండలం కందుకూరు గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 1469లో గల సాగుభూమి లో బోరు వేసి 18 హెచ్ పి విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ కొరకు ఏపీ ఎస్పీడీసీఎల్ మదనపల్లి వారి పేరిట డబ్బులు చెల్లించడం జరిగిందని, అధికారులు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయలేదని తమరు ఈ విషయమై మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News